అక్షరటుడే, వెబ్డెస్క్ : MLA Disqualification Case | రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టి వేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ హైకోర్టు (High Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పీకర్తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడంతో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)లు వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు. విచారణ చేపట్టిన స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లను డిస్మిస్ చేశారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ను కొట్టి వేయడంపై ఇప్పటికే బీజేపీ (BJP) హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ సైతం ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై పిటిషన్ వేయగా.. బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలను ఆదేశించింది. అనంతరం విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది.
MLA Disqualification Case | ముగ్గురికి మినహాయింపు
మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అందరిపై ఆ పార్టీ నేతలు అనర్హత పిటిషన్లు వేశారు. హైకోర్టులో మాత్రం ఏడుగురిపై పిటిషన్ వేయడం గమనార్హం. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావులపై బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) పిటిషన్ వేశారు. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్) పేర్లను మినహాయించింది. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
MLA Disqualification Case | ఎందుకు మినహాయించారు
పార్టీ మారిన వారి విషయంలో బీఆర్ఎస్ పట్టు వదలకుండా పోరాడుతోంది. ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ విచారణ చేపట్టి.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నిర్ణయంపై మరోసారి బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇందులో ముగ్గురి పేర్లను ఎందుకు మినహాయించారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో చేరారు. ఆయన ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించారు. త్వరలో ఆయన సొంత గూటికి చేరనున్నట్లు సమాచారం. దీంతో ఆయన పేరును బీఆర్ఎస్ తొలగించినట్లు తెలుస్తోంది. అయితే మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్కుమార్ పేర్లను ఎందుకు తొలగించారో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్

