అక్షరటుడే, హైదరాబాద్: Musi River Development | ఒకప్పుడు హైదరాబాద్ మహా నగరానికే జీవనాడిగా నిలిచిన ఈ నది.. నేడు మురుగు ప్రవాహానికి ప్రతీకగా మారింది. నగర మలినాలు, పరిశ్రమల వ్యర్థాలను భారంగా మోసుకెళ్తోంది. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత దుర్భర కాలుష్య నదుల జాబితాలో చోటుదక్కించుకున్న ఈ మూసీకి.. తిరిగి పూర్వ వైభవం రాబోతుందా…? అంటే అవుననే అంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర సర్కారు రూపొందించిన భారీ ప్రణాళికలతో మూసీ మళ్లీ సజీవంగా మారనుందని అంటున్నారు.
Musi River Development | అనంతగిరి నుంచి కృష్ణ వరకు ప్రయాణం
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ.. సుమారు 250 కి.మీ ప్రయాణించి నల్గొండ జిల్లా వడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ను రెండు భాగాలుగా చీల్చిన ఈ నది చరిత్రలో ఎన్నో ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. కానీ, కాలక్రమేణా మురికి నీటి కాలువగా మారింది. కబ్జాలకు గురై కుచించుకుపోయింది.
Musi River Development | రివర్ఫ్రంట్ కల… నగరానికి కొత్త ముఖచిత్రం
కనుమరుగువుతున్న జీవనాడికి జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ను రూపొందించింది. ఇది కేవలం నది శుద్ధి కోసమే కాదు.. ఇది నగర రూపురేఖలను మార్చే బృహత్తర ప్రణాళికగా పేర్కొంటున్నారు.

Musi River Development | “హైదరాబాద్ థేమ్స్”గా
నదికి 55 కి.మీ పొడవున (14 మండలాల్లోని 46 గ్రామాల పరిధిలో) రివర్ఫ్రంట్ అభివృద్ధి చేయనున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉద్యానాలు, విశాలమైన మార్గాలు, టూరిజం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికితోడు గోదావరి నుంచి నీటిని మూసీకి మళ్లించడం ద్వారా నదిలో నిరంతర ప్రవాహం కల్పించే యోచన చేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. కాలుష్య నియంత్రణ కోసం 60కి పైగా అతిపెద్ద ఎస్టీపీలు నిర్మించనున్నారు. మొత్తం మీద మూసీని “హైదరాబాద్ థేమ్స్”గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.
‘దక్షిణ కాశీ’గా ఓంకారేశ్వర ఆలయం
మూసీ ప్రాజెక్ట్ కు ఆధ్యాత్మిక కోణాన్ని కూడా జోడించారు. మూసీ తీరాన గండిపేట సమీపం (మంచిరేవుల) లో ఓంకారేశ్వర ఆలయం నిర్మించబోతున్నారు. ఈ దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుమారు 8 ఎకరాల్లో ₹ 700 కోట్ల వ్యయంతో కాకతీయ శిల్పకళ ప్రతిబింబించేలా రామప్ప ఆలయ శైలిలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. తద్వారా “దక్షిణ కాశీ”గా ఈ ఆలయం విరాజిల్లాలనేది సర్కారు ధ్యేయం.
గాంధీ సరోవర్… చరిత్రకు నివాళి
ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేక విశేషం ఏమిటంటే మూసీ తీరంలో గాంధీ సరోవర్ ఏర్పాటు. 200 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్ట్లో.. 123 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దీనికితోడు మ్యూజియంలు, ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక దీని పరిధిలోకి వచ్చే కొన్ని పల్లెలను హ్యాండ్లూమ్ గ్రామాలుగా తీర్చిదిద్దనున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును.. “ఇది కేవలం టూరిజం కేంద్రం కాదు — ఇది భారత చరిత్రకు నివాళి” అని సర్కారు పేర్కొంటోంది.
అమలు ఇలా..
మొత్తం ఐదు జోన్లుగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొదట ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (11 కిలోమీటర్లు) పనులు ప్రారంభిస్తారు. మరో దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపూఘట్ వరకు (9 కి.మీ.) పనులు చేపడతారు. ఇలా ఐదు దశల్లో ప్రాజెక్ట్ పూర్తయితే మహా నగరానికి కొత్త రూపం వస్తుంది. నది తీరంలో అంతర్జాతీయ స్థాయి పార్కుల ఏర్పాటుతో టూరిజం హబ్గా హైదరాబాద్ మరింత ఎదుగుతుంది. పచ్చదనం పెంపు వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది.
రియల్ ఎస్టేట్ బూమ్..
ముసీ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రకటనతోనే గండిపేట, నాగోల్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఇప్పటికే భూములకు డిమాండ్ పెరిగింది. ఇక ప్రాజెక్టు పూర్తయితే.. ఇక్కడి ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడి ప్రాంతం కమర్షియల్ హబ్ల అభివృద్ధి చెందనుంది. లగ్జరీ, ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులు విస్తరించనున్నాయి.
వివాదాల సుడి..
మూసీ ప్రాజెక్ట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భూసేకరణపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి — పునరావాసం మధ్య సమతుల్యం సాధించడం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
ఏది ఏమైనా.. సరైన ప్రణాళిక, పారదర్శకతతో ప్రాజెక్టును అమలు చేస్తే.. మూసీ నది తిరిగి హైదరాబాద్ మహా నగర జీవనాడిగా మారుతుంది. లేదంటే.. మరో అసంపూర్తి కలగానే మిగిలిపోనుంది.
ఇది కూడా చదవండి: Paraquat Ban Telangana | పారాక్వాట్ బ్యాన్.. ఈ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం!
