అక్షరటుడే, వెబ్డెస్క్: Odisha | ఒడిశా రాష్ట్రంలోని జగత్ సింగ్ పూర్ జిల్లా (Jagatsinghpur District) పరదీప్ ప్రాంతంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. 23 ఏళ్ల యువతిపై ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారానికి పాల్పడి, చివరకు ఆమెను భవనం పై నుంచి కిందకు తోసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
జిల్లా ఎస్పీ అంకిత్ కుమార్ వర్మ (SP Ankit Kumar Verma) వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన ప్రియుడితో కలిసి వెళ్లి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అతని సూచనల మేరకు ఒక ఆలయానికి చేరుకుంది. అయితే అక్కడి నుంచి ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ప్రియుడు, ఆమెపై అత్యాచారం చేసి రహమా బస్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యాడు.
Odisha | సాయం పేరిట మరో దారుణం
దిక్కుతోచని స్థితిలో బస్టాండ్ వద్ద ఉన్న యువతిని జార్ఖండ్కు చెందిన మరో వ్యక్తి గమనించాడు. సాయం చేస్తానని నమ్మబలికి ఆమెను పారాదీప్లోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ భవనం పైకప్పుపైకి తీసుకెళ్లి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. దారుణం బయటపడుతుందనే భయంతో ఆమెను నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం బయటపడింది. యువతి కనిపించడం లేదని ఆమె సోదరుడు ఫిబ్రవరి 22న తిర్టోల్ పోలీస్ స్టేషన్ (Tirtol Police Station)లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద నమోదు చేశారు.
Odisha | నమ్మించి మోసం చేసిన ప్రియుడు
ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. “ఇంకా ఎంతమంది అమాయకులు బలి కావాలి? రాష్ట్రంలో చట్టం ఉందా లేదా?” అంటూ ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మించి మోసం చేసిన ప్రియుడు, ఆపదలో ఆదుకోవాల్సిన అపరిచితుడు ఇద్దరూ రాక్షసుల్లా మారడంతో ఒక యువతి ప్రాణం బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

