అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Oil Palm Industry | జిల్లాలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా (Armoor Sub-Collector Abhigyan Malviya) ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయిల్ పామ్ ఇండస్ట్రీ నెలకొల్పేందుకు అనువైన స్థలాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
Oil Palm Industry | జిల్లాలో ఆయిల్ పామ్ ఇండస్ట్రీతో ఉపాధి..
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పిసుదర్శన్ రెడ్డి (MLA P. Sudarshan Reddy) మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మాట్లాడడం జరిగిందన్నారు. పరిశ్రమను జిల్లాకు మంజూరు చేసేందుకు సీఎం సంసిద్ధత తెలిపారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా అనువైన స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటైతే పెద్ద సంఖ్యలో ఆదర్శ రైతులు ఈ పంట సాగును చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. దీనివల్ల రైతులకు గణనీయమైన లాభాలు సమకూరడమే కాకుండా, ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Oil Palm Industry | వంట నూనె తయీరీతో పాటు..
వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణంలోపే ఈ పంట సాగు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఇతర దేశాల నుండి వంట నూనె నిల్వలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి రావడం భారంగా పరిణమించిందని, స్థానికంగానే ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు ప్రజలకు కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని, ఇన్పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు.

Oil Palm Industry | పంట సాగుకు ప్రభుత్వ భరోసా..
ఆయిల్ పామ్ మొక్కలకు అయ్యే వ్యయంలో కూడా అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదని భరోసా కల్పించారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను సైతం పొందవచ్చని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చెప్పారు.
ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం రూ.2లక్షల పైగా ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు. స్థల పరిశీలన జరిపిన వారిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, రమణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Navodaya Results | నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

