హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ ఆధారిత ఏఐ కంప్యూట్ ప్లాట్ఫాంను నిర్మించేందుకు ఓఎక్స్ఎంఐక్యూ (OXMIQ Labs) ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (AMI) చేతులు కలిపాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా 2030 నాటికి 2 గిగావాట్ల భారీ ఏఐ కంప్యూట్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇందులో భాగంగా తొలి దశలో 1 గిగావాట్ హబ్ను నోయిడాలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే, సంప్రదాయ డేటా సెంటర్లతో పోలిస్తే ఇక్కడ విద్యుత్ ఖర్చులు దాదాపు 50 నుండి 70 శాతం వరకు తక్కువగా ఉంటాయి. ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి నుండి సాఫ్ట్వేర్ వరకు అన్ని ఒకే చోట లభించే పూర్తి స్థాయి ఏఐ మౌలిక వేదికగా నిలవనుంది.
ఈ భారీ ప్రాజెక్టులో ఓఎక్స్ఎంఐక్యూ సంస్థ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టింది. హార్డ్వేర్ రోడ్మ్యాప్ సప్లై చెయిన్ వ్యూహాలను రూపొందించడంలో ఏఎంఐ ల్యాబ్స్కు ఈ సంస్థ సహకరిస్తుంది. నోయిడాలో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతుండగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
కాగా, పర్యావరణహిత ఇంధన రంగంలో దిగ్గజమైన గ్రీన్కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. ప్రముఖ టెక్ నిపుణుడు రాజా కోడూరి నేతృత్వంలోని ఓఎక్స్ఎంఐక్యూకి ఉన్న అంతర్జాతీయ అనుభవం తమకు ఎంతో తోడ్పడుతుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి పేర్కొన్నారు. కర్బన రహిత విద్యుత్తును గ్లోబల్ స్థాయిలో అందుబాటులోకి తెచ్చిన ఏఎంఐ ల్యాబ్స్ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి ఈ సందర్భంగా వెల్లడించారు.

