అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan Fuel Crisis | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ (Pakistan)ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో ఆ దేశం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇంధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పెట్రోల్ ధరలకు లీటర్కు రూ.55 మేర పెంచారు. ధరలు మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నట్లు షరీఫ్ వెల్లడించారు. రెండు నెలల పాటు ప్రభుత్వ వాహనాలకు ఇంధన కేటాయింపును 50 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ కాలంలో 60 శాతం ప్రభుత్వ వాహనాలు పనిచేయడం మానేస్తాయన్నారు.
Pakistan Fuel Crisis | ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని పాక్ పీఎం ఆదేశించారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేస్తారన్నారు. అంబులెన్స్లు, ప్రభుత్వ రవాణా వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయని చెప్పారు. మిగతా ప్రభుత్వ వాహనాలకు 50శాతం ఇంధనం కోత పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టారు. కొత్త పరికరాల కొనుగోలుపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Pakistan Fuel Crisis | బడులకు సెలవులు
ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్లో పాఠశాల సెలవులను పొడిగించారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. మంత్రులు, సలహాదారులకు రెండు నెలల పాటు జీతం నిలివేస్తామని, మిగతా ఎంపీల జీతాలు 25 శాతం తగ్గుతాయని షరీఫ్ ప్రకటించారు. నెలకు 3 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు రెండు రోజుల జీతాన్ని వదులుకుంటారన్నారు.
Pakistan Fuel Crisis | విదేశీ ప్రయాణాలపై నిషేధం
పాక్ మంత్రులు, సలహాదారులు, అధికారుల అధికారిక విదేశీ ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసరం అయితేనే ఇతర దేశాలకు వెళ్లాలని పేర్కొంది. అన్ని రాష్ట్ర విందులు, ఇఫ్తార్లపై కూడా నిషేధం అమలు చేస్తున్నట్లు పాక్ ప్రధాని పేర్కొన్నారు. ఇంధన ధరలు మరింత పెరగకుండా చూసుకోవడానికి తాను ప్రయత్నిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Trump Oil Price Comments | చమురు ధరలు తగ్గుతాయి : ట్రంప్ కీలక వ్యాఖ్యలు

