అక్షరటుడే, వెబ్డెస్క్ : Parent Care Salary Cut | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టనుంది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ‘టీఈఏఎంపీఎస్-2026’ (తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్) పేరుతో చట్టం తీసుకు రావాలని యోచిస్తోంది.
తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) సాధిస్తారు. అయితే అలాంటి తల్లిదండ్రులను ఉద్యోగాలు వచ్చాక చాలా మంది పట్టించుకోవడం లేదు. పెళ్లి కాగానే పేరెంట్స్ను దూరం పెడుతున్నారు. వృత్తిరిత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న చాలా మంది తల్లిదండ్రులను ఊళ్లలో వదిలేస్తున్నారు. కనీసం ఎలా ఉన్నారని వారానికి ఒకసారి ఫోన్ చేయడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు చట్టం తీసుకు రానుంది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
Parent Care Salary Cut | 15 శాతం కోత
కొత్త చట్టం ప్రకారం.. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కోత విధించనున్నారు. ఎవరైన తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణ జరుపుతారు. అనంతరం ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి కోత పెట్టి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఆ మొత్తాన్ని అందరి జీతాల్లో నుంచి సమానంగా కట్ చేస్తారు.
Parent Care Salary Cut | 45 రోజుల్లో..
పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులు ఆన్లైన్, ఆఫ్లైన్లో జిల్లా కలెక్టరేట్లలో ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. అధికారులు స్పందించి 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తారు. కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను ఆశ్రయించే అవకాశం కూడా కల్పించనున్నారు. సొంతంగా పెన్షన్, ఇతర ఆదాయ వనరులు లేకుండా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి..: land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల

