అక్షరటుడే, వెబ్డెస్క్: Partial Lunar Eclipse | దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున (మార్చి 3) సింహ రాశిలో పుబ్బ నక్షత్రంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం (Partial Lunar Eclipse) ఏర్పడనుంది. ఇది విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడుతున్న చివరి గ్రహణం. భారతదేశంలోనూ కనిపించనుంది. అయితే ఈ గ్రహణం భారత్లో పాక్షికమే.. మన దేశంలో గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి చంద్రోదయం కాదు. గ్రహణం విడుపు సమయానికి చంద్రోదయం అవుతుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం పాక్షికమే అయినా సాధారణ గ్రహణ సమయాలలో పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తలను తప్పకుండా అనుసరించాలని పండితులు సూచిస్తున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 వరకు మూసిఉంచనున్నట్లు ప్రకటించారు. ఇతర ప్రధాన ఆలయాలను కూడా గ్రహణకాలంలో మూసి వేస్తారు. గ్రహణం వీడాక ఆలయాలను శుద్ధి చేసి రాత్రికి తెరుస్తారు.
Partial Lunar Eclipse | పట్టు, విడుపు సమయాలు
మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు చంద్రగ్రహణం (Partial Lunar Eclipse) ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణ కాలం మొత్తం 3 గంటల 27 నిమిషాలు. ఈ సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. ఆ సమయంలో పూజ, శుభకార్యాలు మొదలైన వాటికి దూరంగా ఉంటారు. పేరుకు ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నుంచి 40 నిమిషాల పాటు మాత్రమే కనిపించనుంది. అదీ ఈశాన్య భారతంలో మాత్రమే.. ఆస్ట్రేలియా, అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.
పాటించాల్సిన నియమాలు..
- సనాతన ధర్మాన్ని అనుసరించేవారు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. వారు భోజన కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటలలోపు ముగించాలి.
- ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై దర్భలు వేయాలి.
- గ్రహణానికి ముందు, గ్రహణం తరువాత పట్టు, విడుపు స్నానాలు ఆచరించాలి. గ్రహణం విడిచే సమయంలో సముద్ర స్నానం కానీ, నదీస్నానం కానీ చేయడం సర్వ శుభప్రదమని భక్తులు భావిస్తారు.
- రాత్రి 7:30 తరువాత విడుపు స్నానం చేసి, దైవారాధన చేయాలి. అనంతరం ఆహారాన్ని తీసుకోవచ్చు.
- ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతున్నందున ఆ రాశివారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. అలాగే గర్భిణులు చంద్రకిరణాలు సోకని ప్రదేశంలో ఉండడం మంచిదంటున్నారు.
దైవారాధనతో ఉత్తమ ఫలితం..
గ్రహణ కాలాన్ని హిందువులు సున్నితమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం మరియు మితంగా ప్రవర్తించడం ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. గ్రహణం అంటే భయపడకుండా దైవారాధన చేయాలని వేద పండితులు సూచిస్తున్నారు. దుర్గాదేవిని స్మరించడం, పంచాక్షరి మంత్ర జపం చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలాన్ని పొందవచ్చంటున్నారు.
ఇది కూడా చదవండి..: Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి!

