అక్షరటుడే, హైదరాబాద్: PMAY 2.0 Telangana | తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర సర్కారు ఒకే చెప్పింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వనున్నారు.
PMAY 2.0 Telangana | 18,213 ఇళ్లు..
తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్లను నిర్మించాలనే ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తన వాటాగా అందించాల్సిన నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.
ఢిల్లీలో పీఎంఏవై (పట్టణ) 2.0 పథకం సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు ఎండీ తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో రూ.910.65 కోట్ల (కేంద్రం వాటా రూ.273.20 కోట్లు, రాష్ట్రం వాటా రూ.637.45 కోట్లు) అంచనా వ్యయంతో 18,213 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదలను పరిశీలించిన కేంద్రం.. ఇళ్ల నిర్మాణాలను చేపట్టడానికి అనుమతించినట్లు ఎండీ గౌతం వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయడానికి కేంద్రం నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు.

