అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy EV Plan | హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా ప్రజాభవన్లో మహిళా జర్నలిస్ట్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ గొప్పదన్నారు. మిగతా నగరాలు కాలుష్యం, ట్రాఫిక్, వరదలతో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. హైదరాబాద్కు ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ (ORR) అవతలకు తరలిస్తామన్నారు. కాలుష్య కారకమైన వాహనాలను సైతం నిషేధిస్తాని పేర్కొన్నారు. 2026 డిసెంబర్ వరకు హైదరాబాద్లో ఆర్టీసీ డీజిల్ బస్సులు లేకుండా చేస్తామన్నారు. మొత్తం విద్యుత్ బస్సులు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే 500 బస్సులు కొనుగోలు చేశామని, 2500 బస్సులు త్వరలో కొనుగోలు చేస్తామన్నారు.
Revanth Reddy EV Plan | ఈవీ బైక్లకు ప్రోత్సాహం
నగరంలోని రెండు లక్షల ఆటోలను సైతం విద్యుత్తో నడిచేలా మారుస్తామన్నారు. ఈవీ బైక్లపై పన్నులు రద్దు చేశామన్నారు. త్వరలో విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం సాధ్యం కాకపోవచ్చని, అయితే త్వరలో స్కూటీలు ఇస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తామన్నారు.
Revanth Reddy EV Plan | ఉన్నత స్థాయికి చేరాలి
తెలంగాణ మహిళలు తయారుచేసే వస్తువులకు అమెజాన్లో అమ్మకానికి అవకాశం కల్పించామని రేవంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. మహిళా సంఘాలు వెయ్యి బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాయన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో సైతం మహిళా సంఘాలకు చేయూత అందిస్తున్నట్లు తెలిపారు.
Revanth Reddy EV Plan | ప్రోత్సహించాలి
మహిళల ఆర్థిక శక్తి పెరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం పేర్కొన్నారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో మహిళలపై వివక్ష ఉందన్నారు. అమెరికాలో సైతం వివక్ష ఉందని పేర్కొన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉందని, మన దగ్గర అది లేదన్నారు.
ఇద్దరిని కనాలి
తెలంగాణలో జనాభా పెరగడం లేదని సీఎం చెప్పారు. గతంలో కుటుంబ నియంత్రణతో పాపులేషన్ పెరగడం లేదన్నారు. యువత మేమిద్దరం.. మాకు ఒక్కరు అనుకుంటున్నారని, కనీసం మాకు ఇద్దరు అనుకున్న జనాభా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మూసీ ప్రక్షాళన చేస్తాం
మూసీ (Musi River) ప్రక్షాళన ఎందుకు చేయొద్దని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈసా నదిని నాలా అని చూపి అక్రమంగా అపార్ట్మెంట్ కట్టారన్నారు. నాలాకు పది మీటర్లు, నదికి 50 మీటర్లు బఫర్ జోన్ అని చట్టం ఉందన్నారు. అపార్ట్మెంట్ వాసులు నష్టపోకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలకు విలువ లేదని చెప్పారు. వాటిని తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. దీనిపై ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన బాధితులకు సూచించారు.
జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ఫిర్యాదు చేయడానికి ఓ వేదిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. దీనికోసం చట్టం తెస్తామన్నారు. డెస్క్ జర్నలిస్ట్లు (Desk Journalists), ఫీల్డ్ జర్నలిస్ట్లకు తేడా లేదన్నారు. అందరికి అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలపై త్వరలో ప్రకటన చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్లకు ఒక కాలనీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


