అక్షరటుడే, వెబ్డెస్క్ : RK Roja Tamil Nadu | తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేయగా, ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళ రాజకీయాల్లో ఆకస్మికంగా ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
మార్చి 1న డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (Tamilnadu CM M.K. Stalin) పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రోజా, ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. స్టాలిన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఆమె కొనియాడారు.
RK Roja Tamil Nadu | ఏపీ రాజకీయాల గురించి కూడా..
ప్రత్యేకంగా మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రతినెలా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1000 జమ చేసే పథకాన్ని ఆమె ప్రశంసించారు. ఇది మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలకమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇటీవల మహిళల ఖాతాల్లో ఒకేసారి రూ.5000 జమ చేయడం ద్వారా ప్రభుత్వ నిబద్ధత స్పష్టమైందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తమైందని రోజా తెలిపారు. కూలి పనులకు వెళ్లే మహిళలు, విద్యార్థినులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రస్తావిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మహిళలకు నేరుగా నగదు అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి కూడా జమ కాలేదని ఆరోపించారు.

RK Roja Tamil Nadu | తమిళనాడులో డీఎంకే తరపున ప్రచారం
స్టాలిన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని రోజా వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న స్టాలిన్ను తమిళ ప్రజలు భారీ మెజారిటీతో మళ్లీ గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే, తమిళనాడులో డీఎంకే తరపున ప్రచారం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాబోయే ఎన్నికల్లో ఈ మద్దతు ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి

