అక్షరటుడే, వెబ్డెస్క్: Samsung Mobile Fraud | ఆన్లైన్లో తక్కువ ధరకే శాంసంగ్ మొబైల్ ఫోన్ ఇస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendranagar Police Station) పరిధిలోని హైదర్గూడలో ఉన్న ఒక కార్యాలయంపై పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసాలకు కర్ణాటకకు చెందిన ఎస్. విజయ్ కుమార్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు శివకుమార్, ముద్దీన్, శశికాంత్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Samsung Mobile Fraud | సులభంగా డబ్బులు సంపాదించాలని..
పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ గతంలో తానే ఒక ఆన్లైన్ మోసానికి గురై డబ్బులు కోల్పోయాడని తెలిసింది. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇదే విధానాన్ని అనుసరిస్తూ మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ ముఠా గత ఐదేళ్లుగా ఈ మోసాలను కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2021 నుంచి ఇప్పటివరకు సుమారు 3,880 మందిని మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. తక్కువ ధరకే శాంసంగ్ మొబైల్ ఫోన్ (Samsung Mobile Phone) ఇస్తామని చెప్పి టెలీకాలర్ల ద్వారా బాధితులకు ఫోన్లు చేసి ఆర్డర్లు తీసుకునేవారు. డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రం అసలు మొబైల్ ఫోన్ పంపకుండా బ్లూటూత్ స్పీకర్లు లేదా తక్కువ విలువ కలిగిన హెర్బల్ ఉత్పత్తులను పోస్టు ద్వారా పంపించి మోసం చేసేవారు.
Samsung Mobile Fraud | పెద్ద మొత్తంలో
నిందితులు నిర్వహిస్తున్న కార్యాలయంలో నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.40 లక్షల నగదు, 50 సిమ్ కార్డులు, ల్యాండ్ ఫోన్లు మరియు ఇతర పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితులను కోర్టులో హాజరుపరచగా, కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఆఫర్లకు మోసపోవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు.
ఇది కూడా చదవండి..: VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల

