అక్షరటుడే, వెబ్డెస్క్ : Sathankulam Custodial Death Case | తమిళనాడు (Tamil Nadu)లోని మదురై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు (Madurai Court) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. లాకప్ డెత్ కేసులో నిందితులైన 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించింది.
తూత్తుకుడి జిల్లాలోని సాత్తంకుళంలో పి. జయరాజ్, అతని కుమారుడు జె. బెనిక్స్ హత్య కేసులో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది. కోవిడ్-19 లాక్డౌన్ (Covid Lockdown) సమయంలో నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా తమ దుకాణాన్ని తెరిచి ఉంచారన్న ఆరోపణలపై 2020 జూన్ 19 సాయంత్రం జయరాజ్, బెనిక్స్లను సాత్తంకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాత్రి పోలీసులు వారిని దారుణంగా హింసించారు. మరుసటి రోజు కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించారు. అయితే 2020 జూన్ 22న కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బెనిక్స్ మరణించగా, అతని తండ్రి జయరాజ్ జూన్ 23న చనిపోయాడు.
Sathankulam Custodial Death Case | సీఐ, ఎస్సైలు..
లాకప్డెత్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. అప్పటి ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు కె. బాలకృష్ణన్, పి. రఘు గణేష్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. మురుగన్, ఎ. సమదురై, కానిస్టేబుళ్లు ఎం. ముత్తురాజా, ఎస్. చెల్లదురై, ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్, ఎస్. వైల్ముత్తు అనే తొమ్మిది మందికి న్యాయమూర్తి జి. ముత్తుకుమారన్ మరణశిక్ష విధించారు. ఈ కేసులో 10వ నిందితుడు, అప్పటి స్పెషల్ సబ్-ఇన్స్పెక్టర్ పాల్దురై అరెస్టు అయిన తర్వాత ఆగస్టు 2020లో కోవిడ్-19 కారణంగా మరణించారు. ఈ తీర్పుతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీ హింస కేసులలో జవాబుదారీతనానికి ఇది ఒక అరుదైన, బలమైన ఉదాహరణగా చాలామంది భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి : PNG Connections India | పెరిగిన పీఎన్జీ కనెక్షన్లు..
