అక్షరటుడే, వెబ్డెస్క్: SCB Hospital Fire | ఒడిశా రాష్ట్రం (Odisha State)లోని కటక్ నగరంలో ఉన్న ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ విభాగానికి చెందిన ఐసీయూలో మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
SCB Hospital Fire | షార్ట్ సర్క్యూట్ కారణంగానే
సమాచారం ప్రకారం, సోమవారం తెల్లవారుజామున సుమారు 2.30 నుంచి 3 గంటల మధ్య ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ఐసీయూలో ఉన్న రోగులను త్వరితగతిన ఆసుపత్రిలోని ఇతర విభాగాలకు తరలించే ప్రయత్నం చేశారు.
SCB Hospital Fire | ఘోర ప్రమాదం..
అయితే ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మృతిచెందారు. వారిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు చికిత్స కోసం తరలిస్తుండగా మరణించారు. తీవ్ర కాలిన గాయాలు మరియు ఊపిరాడకపోవడం వల్ల వారు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రామా కేర్ ఐసీయూ (Trauma Care ICU) మరియు పక్కనే ఉన్న మరో ఐసీయూలో కలిపి మొత్తం 23 మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. వారిలో పలువురు గాయపడగా, వారిని ఇతర వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రోగులను రక్షించే ప్రయత్నంలో ఆసుపత్రి సిబ్బంది కూడా గాయపడ్డారు. మొత్తం 11 మంది సిబ్బందికి కాలిన గాయాలు కావడంతో వారికి కూడా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.
SCB Hospital Fire | ఈ ఘటనపై విచారణకు సీఎం ఆదేశాలు
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి (Odisha CM Mohan Charan Majhi) హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న గాయపడిన రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై న్యాయ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అగ్నిమాపక శాఖ డీజీ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి త్వరగా నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన రోగులు మరియు సిబ్బందికి ఉత్తమ వైద్యం అందించాలని కూడా సీఎం ఆదేశించారు. సీఎం వెంట రాష్ట్ర ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్ (Mukesh Mahaling) కూడా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు.
ఈ ఘటనపై ఒడిశా ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం (Fire Accident)లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఆయన ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి..: Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్

