అక్షరటుడే, ఇందూరు: SSC Exam Rules | SSC పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి (DEO) కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయింది.
జిల్లాలో SSC పరీక్షలు – 2026 జరుగుతున్నాయి. కాగా, మొన్నటి హిందీ పరీక్ష పేపర్ లీకేజీ కావడంతోపాటు నెట్టింట వైరల్ అయింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న పలువురు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయ్యాయి. జిల్లాలోని ఎంఈవోలను ఇందుకోసం నియమించారు.
SSC Exam Rules | కఠిన నియంత్రణ
పరీక్షల నిర్వహణ సమయంలో.. పరీక్ష విధుల్లో లేని ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఉండరాదని DEO స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, CCA రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికితోడు అన్ని పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. తద్వారా మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షించనున్నారు.
SSC Exam Rules | సెల్ఫోన్పై నిషేధం ఉన్నా..
పరీక్ష జరిగే సమయంలో సిబ్బంది సెల్ఫోన్లు తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించారు. పరీక్ష విధుల్లో ఉన్నవారిలో ఎవరైనా సెల్ఫోన్తో పట్టుబడితే, వారిని తక్షణమే సర్వీస్ నుంచి తొలగించనున్నట్లు హెచ్చరించారు. కాగా, ఇటీవల జరిగిన హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో వేటుకు గురైన ఉపాధ్యాయుల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ముఖ్యంగా విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు పొందేందుకు ముందస్తుగా ఒప్పందం చేసుకుని పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయుల్లో కొందరిని సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయమై రాష్ట్ర స్థాయి అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ అధికారులు, విధుల్లో ఉన్న అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
ఇదే సమయంలో కీలకమైన సూచనలు సైతం చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ను కొందరు ఉపాధ్యాయులు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాల్సిన టీచర్లు, విద్యాశాఖ అధికారులు పదో తరగతి పరీక్షల సమయంలో ఇలా అక్రమాలకు పాల్పడటంపై విమర్శలు వెలువడుతున్నాయి. అయితే, సోమవారం జరగబోయే ఆంగ్ల పరీక్ష నిర్వహణ అధికారులకు కత్తి మీద సాముగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: SSC Paper Leak | నిజామాబాద్లో ఎస్ఎస్సీ హిందీ పేపర్ లీకేజీ.. నెట్టింట వైరల్.. తొమ్మిది మంది ఉపాధ్యాయులపై వేటు!

