అక్షరటుడే, కామారెడ్డి: Stray Dog Attack : పిచ్చికుక్కల దాడిలో ఆరుగురికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో బుధవారం రాత్రి పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. గ్రామంలో స్వైర విహారం చేస్తూ రోడ్డుపై కనబడిన వారిపైన దాడి చేస్తూ పోయాయి.
Stray Dog Attack : గుంపులుగా..
గ్రామంలో పలు గల్లీలలో గుంపులుగా పిచ్చికుక్కలు తిరుగుతూ దారిపై వెళ్లే వారిపై దాడికి పాల్పడ్డాయి. కుక్కల దాడిలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పిచ్చికుక్కల గుంపు ఒకేసారి దాడికి పాల్పడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
పట్టించుకోని అధికారులు..
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. పిచ్చికుక్కలను తరిమికొట్టాలని ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి గ్రామం నుంచి కుక్కలను తరిమికొట్టాలని కోరారు.

