అక్షరటుడే, వెబ్డెస్క్: Sugar Daddy Parties | బెంగళూరులో జరిగిన గ్యాంగ్రేప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు చూస్తున్నాయి. జక్కూర్లోని ఓ విల్లాలో 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆరోపణలు ఉన్న కేసును విచారిస్తుండగా.. బెంగళూరులోని పలు విల్లాలు, స్టార్ హోటళ్లలో “షుగర్ డాడీ–షుగర్ బేబీ” పేరుతో ప్రత్యేక పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు నెట్వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ పార్టీల ద్వారా యువతులను మోసం చేసి.. శారీరకంగా లోబర్చుకోవడం, తర్వాత బ్లాక్మెయిల్ చేసే అతి పెద్ద రాకెట్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Sugar Daddy Parties | ప్రత్యేక కోడ్ పదాలు
తాజా రేప్ కేసులో బసవేశ్వరనగర్కు చెందిన నిఖిల్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతగాడే ఈ ప్రత్యేక పార్టీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ పార్టీలకు ప్రత్యేక కోడ్ పదాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. 25 వయస్సు ఏళ్ల లోపు యువతులను “షుగర్ బేబీస్”గా.. 45 ఏళ్లకు పైబడిన మగవారిని “షుగర్ డాడీస్”గా పిలుస్తున్నట్లుగా తెలుస్తోంది.. వీరికి ముందుగా ఇచ్చే పాస్వర్డ్ల ద్వారా మాత్రమే ప్రత్యేక పార్టీల్లోకి ప్రవేశం కల్పించేవారని పోలీసులు చెబుతున్నారు.
యువతులను పెద్ద మొత్తంలో డబ్బు, అతి ఖరీదైన బహుమతులు, లగ్జరీ జీవితం ఆశ చూపి ఈ ప్రత్యేక పార్టీలకు ఆహ్వానించేవారని తెలుస్తోంది. కొన్నిసార్లు పానీయాల్లో మత్తు మందు కలిపి లైంగిక దాడులకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. లైంగిక దాడి వీడియోలు, ఫొటోలు తీసి, బాధితులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగేవారని, మళ్లీ మళ్లీ లైంగిక దాడికి పాల్పడేవారని సమాచారం.
Sugar Daddy Parties | పోలీస్ అధికారికి చెందిన విల్లా..
గ్యాంగ్రేప్ ఆరోపణలు ఉన్న జక్కూర్ విల్లా ఒక సీనియర్ పోలీస్ అధికారికి చెందినదిగా నివాసంగా తెలుస్తోంది. దీనిని ఆయన మరొకరికి లీజుకు ఇచ్చారని, సదరు వ్యక్తి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వేరేవారికి తాత్కాలికంగా అద్దెకు ఇవ్వడంతో నిఖిల్ అనే వ్యక్తి పార్టీ కోసం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. కాగా, రేప్ ఘటనపై సదరు పోలీస్ అధికారికి తెలియదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Sugar Daddy Parties | హనీట్రాప్ కేసు..
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఒక రోజు ముందే.. అమృతహళ్లి పోలీస్ స్టేషన్లో నిఖిల్ ఫిర్యాదు చేశాడు. తనను హనీ ట్రాప్ చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించాడు. ఇందుకు తన మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోలను ఆధారంగా చూపించాడు.
కానీ, గ్యాంగ్రేప్ కేసులో అరెస్టు చేసే సమయంలో నిఖిల్ మొబైల్ కనిపించకపోవడం గమనార్హం. తన మొబైల్ను మరమ్మతులకు ఇచ్చినట్లు అతగాడు చెప్పినట్లు సమాచారం. కాగా, గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు నిందితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు మొబైల్స్లోని వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఇలాంటి పార్టీలు ఇంకా ఎన్నిచోట్ల జరుగుతున్నాయి..? బాధితులు మరింత మంది ఉన్నారా..? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ పార్టీల నిర్వహణలో ఇంకెవరైనా భాగస్వాములుగా ఉన్నారా..? అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.
గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తును బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా మరికొన్ని అరెస్టులు చేపట్టే అవకాశముందని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.

