అక్షరటుడే, వెబ్డెస్క్: Trump Tariffs Suspension | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచదేశాలపై ఇష్టవచ్చినట్లు విధించిన టారిఫ్లు చెల్లబోమని ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. తీర్పు ప్రకారం అమెరికా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సుప్రీం చెల్లవని తెలిపిన టారిఫ్లను.. మంగళవారం నుంచి వసూలు చేయబోమంటూ యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది.
Trump Tariffs Suspension | రిఫండ్ చేస్తారా..
ఐఈఈపీఏ (అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం) కింద డొనాల్డ్ ట్రంప్ వేసిన టారిఫ్ల వసూళ్లను నిలిపివేయనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ఆపేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే దిగుమతిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటివరకు దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్లను రిఫండ్ చేస్తారా? లేదా? అనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
సుప్రీం తీర్పు నేపథ్యంలో..
ట్రంప్ వేసిన టారిఫ్లు చెల్లవని యూఎస్ సుప్రీం తీర్పు వెల్లడించిన మూడు రోజుల తర్వాత నిలిపివేతపై ప్రకటన రావడం గమనార్హం. అధ్యక్షుడి అత్యవసర అధికారాల చట్టాన్ని ఉపయోగించుకుని.. ప్రతీకార సుంకాలు వేయడాన్ని అగ్రరాజ్య అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ టారిఫ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరి 20న తీర్పు వెల్లడించింది. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ప్రపంచదేశాలపై 15 శాతం సుంకాలు వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. అయితే.. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇప్పటికీ జారీ కాలేదు. దీంతో కొత్త టారిఫ్లు రేపటి నుంచే వర్తిస్తాయా? లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

