అక్షరటుడే, హైదరాబాద్: Teenmar Mallanna Remarks | ప్రజలకు ఉపయోగ పడని రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఎందుకు ఇవ్వాలని ఎమ్మెల్సీ Teenmar Mallanna నిలదీశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ జీతాలు తీసుకోవడం సరికాదని మల్లన్న తీవ్రంగా విమర్శించారు.
Teenmar Mallanna Remarks | ప్రజలకు సేవ చేయని నాయకులు..
సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పని చేయాలని హితవు పలికారు. కానీ, చాలా మంది నాయకులు ప్రజల కోసం పని చేయకుండా పదవులు, జీతాలు మాత్రం దర్జాగా పొందుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఉపయోగం లేకపోతే అలాంటి నాయకులకు జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేకం ఉన్నప్పటికీ వాటిపై నాయకులు మాట్లాడటం లేదని మల్లన్న ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయని నాయకులను ప్రజలే ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకునే వారు ప్రజల సమస్యలపై పోరాడాలని, లేకపోతే పదవుల్లో ఉండటానికి అనర్హులని మల్లన్న ఘాటుగా వ్యాఖ్యానించారు.
Teenmar Mallanna Remarks | రాజకీయ నేతలకు పెన్షనా..?
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా తన వేతనం నెలకు రూ. 2.70 లక్షల వేతనం పొందుతున్నానని తెలిపారు. అలవెన్సులు అదనం అని పేర్కొన్నారు. ఇంకా తాను తిరగడానికి రూ. 50 లక్షల విలువ చేసే వాహనం కొనుగోలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇలా తాను ఎమ్మెల్సీగా నెల రోజులు పనిచేసినా.. జీవితకాలం పాటు పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు.
ఇలా రాజకీయ నాయకులకు ప్రజాధనం ధారపోయడం కాకుండా.. ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు వారి జీవిత చరమాంకంలో ఆసరాగా ఉండేందుకు పెన్షన్ అందించాలని సూచించారు.

