అక్షరటుడే, ఇందూరు: Telangana Education Commission | తెలంగాణ విద్యావిధానం పేరుతో విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయని టీపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా (Nizamabad District) అధ్యక్ష, కార్యదర్శులు వెనిగళ్ల సురేష్, అర్వింద్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.
Telangana Education Commission | ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ అని మాట్లాడడం సరికాదు..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ అని వ్యాఖ్యానించడం సరికాదని టీపీటీఎఫ్ ప్రతినిధులు అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తెలంగాణ విద్యావిధానం పేరుతో సమర్పించిన రిపోర్టులో ఒకటో తరగతి నుంచి మూడు భాషల విద్యా విధానం ప్రవేశపెడతామని పేర్కొనడం విద్యార్థులపై భారం మోపడమేనన్నారు. ఆ రిపోర్టులో కొన్ని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యాకమిషన్ గ్రామీణ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. గ్రామీణ పాఠశాలలను కుదిస్తూ మండలానికి ఒకటి లేదా రెండు ఫౌండేషన్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ విద్యను కేంద్రీకరణ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యాకమిషన్ రిపోర్టు ప్రభుత్వ పాఠశాలను కుదిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేలా ఉందని వారు ఆరోపించారు.
Telangana Education Commission | ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం..
పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయడం ఆహ్వానించదగ్గ విషయమైనప్పటికీ సుశిక్షుతులైన ఉపాధ్యాయుల కొరత ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక కళాశాలల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా పర్మినెంట్ పద్ధతిలో ఉపాధ్యాయుల నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, సర్వీసు, సేవలను బట్టి కాకుండా ప్రతిభ ఆధారంగా ఇస్తామనడం అనేక ప్రతికూల అంశాలకు దారితీస్తాయన్నారు. అదేవిధంగా పదోతరగతి ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసే ప్రక్రియలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల అంశాలను లోతుగా చర్చించాలన్నారు.

Telangana Education Commission | నిబంధనల మేరకే వేతనాలు..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించడం సరికాదని.. ఉపాధ్యాయుల అర్హతలు, సేవలు, పే కమిషన్ సిఫార్సుల ప్రకారమే ఇతర ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల వేతనాలు కూడా నిర్ణయించబడతాయన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) పేరుతో కొన్ని గ్రామాల్లోని పాఠశాలను విలీనం చేసి, ఆయా గ్రామాల్లో బడులు లేకుండా చేసి, బస్సుల ద్వారా విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం నిర్వహించబడుతున్న అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలను సెమి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని వారు కోరారు.
Telangana Education Commission | ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి
విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీపోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ, సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణ విధానాన్ని మెరుగుపర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలను కూడా మూసివేయాలన్నారు. విద్యకు బడ్జెట్ కేటాయింపుల పెంపు, మధ్యాహ్న భోజనం ధరల పెంపు, సత్వర చెల్లింపులు, యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి, ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ, నిధుల కేటాయింపు, కళాశాల్లో విద్యార్థి ఎన్నికలు, ప్రైవేటు రంగంలో ఫీజులను నియంత్రణ వంటి అనేక స్వాగతించాల్సిన అంశాలు ఉన్నాయని వాటిని అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..: PDSU National Committee | పీడీఎస్యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్

