అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Speaker Decision | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari), దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై ఇటీవల విచారణ ముగిసింది. దీంతో స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. బుధవారం ఉదయం తీర్పు ప్రకటించారు. వారి అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లను ఆయన కొట్టివేశారు.
Telangana Speaker Decision | ఆధారాలు లేవని..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, సంజయ్, దానం, కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ స్పీకర్ను కోరింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలైలో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో విచారణ చేపట్టిన స్పీకర్ గతంలోనే 8 మందికి ఊరట కలిగించారు. వారు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఎమ్మెల్యేల జీతం నుంచి బీఆర్ఎస్కు పార్టీ ఫండ్ వెళ్తుందనే కారణాలతో పిటిషన్లను కొట్టివేశారు.

Telangana Speaker Decision | ఎంపీగా పోటీ చేసినా..
పార్టీ మారిన వారిలో దానం నాగేందర్ (Danam Nagender) కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురిని కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకున్నారు. అయినా కూడా స్పీకర్ వారికి ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్పీకర్ తీర్పు చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన దానం పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొనడం గమనార్హం. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Telangana Speaker Decision | ప్రజాస్వామ్యంపై దాడి : కేటీఆర్
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీఫామ్ (Congress B Farm) మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం అని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారన్నారు.
ఇది కూడా చదవండి..: Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

