హైదరాబాద్: భారతదేశపు అపారమైన సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీయడానికి నిర్ణయాత్మకమైన ముందడుగు వేయాలని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ దేశీయ అన్వేషణ, ఉత్పత్తిని వేగవంతం చేయాలని నొక్కి చెప్పారు. దేశంలో అపారమైన నిక్షేపాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మనం 90 శాతం చమురు, 95 శాతం రాగి, 99.5 శాతం బంగారాన్ని విదేశాల నుంచే తెప్పించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు.
మన దేశ భౌగోళిక నిక్షేపాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనవని, వీటిని సరిగ్గా వినియోగించుకుంటే భారతదేశ ఇంధన ఖనిజ భద్రతను గణనీయంగా బలోపేతం చేసే అవకాశం ఉంటుందని వివరించారు. అనుకూలమైన విధానాలు వేగవంతమైన అనుమతులు లభిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు వనరుల కంపెనీలకు ఉత్పత్తిని అనేక రెట్లు పెంచే సామర్థ్యం ఉందని, అలాగే తక్కువ పనితీరు కనబరుస్తున్న ప్రభుత్వ ఆస్తులు కూడా సరైన పెట్టుబడితో మెరుగైన ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హిందుస్థాన్ జింక్, బాల్కో వంటి సంస్థలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి ఉత్పత్తి 5 నుండి 10 రెట్లు పెరిగిందని, ఇది మన దేశ వనరుల రంగంలో ఉన్న సామర్థ్యాన్ని నిరూపిస్తోందని అగర్వాల్ తెలిపారు. గత పదేళ్లలో వేదాంత సంస్థ ప్రభుత్వ ఖజానాకు 4.5 లక్షల కోట్ల రూపాయలు జమ చేసిందని ఆయన గుర్తు చేశారు. వ్యవస్థాపకులను శక్తివంతం చేసేందుకు నియంత్రణ నిబంధనలను సరళీకరించాలని, సుదీర్ఘ అనుమతులకు బదులుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ నమ్మకం ఆధారిత పాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వంటి పరిస్థితుల నేపథ్యంలో చమురు, గ్యాస్, బొగ్గు వ్యూహాత్మక లోహాల అన్వేషణను వేగవంతం చేయడం దేశ భద్రతకు ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాబోయే ఏళ్లలో ఇంధన అవసరాలు రెట్టింపు కానున్న నేపథ్యంలో దేశీయ వనరుల వెలికితీత ద్వారా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అగర్వాల్ స్పష్టం చేశారు. చివరగా భారత్ ప్రపంచస్థాయి వనరుల కంపెనీలను నిర్మించగలదని, ఈ రంగంలో పెట్టుబడులకు మన దేశం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానమని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

