అక్షరటుడే, వెబ్డెస్క్ : UPSC Results | సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 ఫలితాలను యూపీఎస్సీ (UPSC) శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ నుంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులను సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అభినందించారు. సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం (Rajiv Civils Abhaya Hastam) పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు హాజరైన 202 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించింది.
UPSC Results | 20 మందికి ర్యాంకులు
రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం కింద మద్దతు పొందిన వారిలో 51 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇందులో 20 మంది అభ్యర్థులు తుది ఫలితాల్లో సత్తా చాటి కొలువులు సాధించారు. ఈ అభ్యర్థుల విజయాలు తెలంగాణ యువత దృఢ సంకల్పం, ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. వారి విజయం రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మంది విద్యార్థులకు సివిల్ సర్వీసెస్లో కెరీర్లను లక్ష్యంగా చేసుకుని ప్రజా సేవకు దోహదపడేలా స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
UPSC Results | ర్యాంకులు సాధించింది వీరే..
గుడెల్లి సృజన (పెద్దపల్లి), తరుణ్ తేజ ఆట్ల (వరంగల్ అర్బన్), బానోత్ లక్ష్మి రచన (రంగారెడ్డి), వెంకటేశ్ ప్రసాద్ సాగర్ (మహబూబ్నగర్), మెరుగు కౌశిక్ (మేడ్చల్), ప్రీతి రాపర్తి (మేడ్చల్), విక్రమ్ బేతి (వరంగల్ అర్బన్), యశ్వంత్ (నల్గొండ), విక్రమ్ సింహారెడ్డి (నల్గొండ), ఆశిష్ అనిశెట్టి (వరంగల్ అర్బన్), విజయ్ సింహారెడ్డి (రంగారెడ్డి), అంగరాజు నవీన్ (సూర్యాపేట), పుడారి రాహుల్ (జగిత్యాల), కుమ్మరి శ్రవణ్కుమార్ (మెదక్), దైనంపల్లి ప్రవీణ్ (ములుగు), ఇస్లావత్ శ్రీరామ్ హర్ష (రంగారెడ్డి), బానోత్ భరత్ కుమార్ (జనగామ), ప్రత్యూష కట్ట (రంగారెడ్డి), జితేంద్ర నాయక్ (భూపాలపల్లి), దీపక్ శర్మ (మేడ్చల్).
దీనిని కూడా చదవండి : UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల

