అక్షరటుడే, వెబ్డెస్క్: Vizianagaram Bus Fire | విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మండలం (Ramabhadrapuram Mandal) తారాపురం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి మల్కాజిగిరి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు వెనుక టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను హెచ్చరించారు. డ్రైవర్ అప్రమత్తంతో అందరూ వేగంగా బస్సు నుంచి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Vizianagaram Bus Fire | పెద్ద ప్రమాదం తప్పింది..
ప్రయాణికులు కిందకు దిగిన కొద్ది సేపటికే మంటలు మరింతగా వ్యాపించి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే బస్సు మంటల్లో కాలి బూడిదైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఈ బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ చాకచక్యంగా స్పందించకపోతే భారీ ప్రాణనష్టం జరిగేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..: Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు

