అక్షరటుడే, భిక్కనూరు: Worms in Midday Meal | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్న నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది.
మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. వెంటనే అన్నం పారబోశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో వెలుగుచూసింది.
Worms in Midday Meal | అధికారుల తీరుపై ఆగ్రహం
భిక్కనూరు మండలంలోని భగీరత్ పల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ప్రభుత్వాదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఈ విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అయినా పరిస్థితిలో ఏ మార్పు లేదు. దీంతో శుక్రవారం విద్యార్థులు తినలేక అన్నం పారేశారు.
అనంతరం తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాఠశాలకు చేరుకున్న గ్రామస్థులు.. ఉపాధ్యాయులను నిలదీశారు. మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు ప్రయ్నతించినప్పటికీ.. ఆయన ఫోను అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీంతో అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెట్టే ఏజెన్సీ నిర్వాహకులను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

