అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్లు, ఇతర గ్రామ పెద్దలతో కూడిన తొమ్మిది మందితో రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు.
Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మన దేశంలో, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల (Road Accidents) కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాలకు నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అత్యున్నత అధికారులు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తూ.. వారిని భాగస్వాములు చేసేందుకు అరైవ్ – అలైవ్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమాల ఔన్యత్యాన్ని గుర్తిస్తూ ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Road Accident Prevention | హెల్మెట్ భారంగా భావించవద్దు..
హెల్మెట్ (Helmet)ను భారంగా భావించకూడదని, ప్రమాద సమయాల్లో ప్రాణాలను రక్షించే శిరస్త్రానాన్ని ద్విచక్ర వాహనదారులు తప్పక ధరించాలని కలెక్టర్ సూచించారు. కార్లలో ప్రయాణించే వారు విధిగా సీట్ బెల్టు ధరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయకూడదని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం రహ్-వీర్ కింద రూ.25వేల ఆర్ధిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. వచ్చేనెల మే 1వ తేదీ నుంచి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని, గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తూ వారి పేర్లను గోప్యంగా ఉంచాలన్నారు. గ్రామ సభకు సర్పంచ్ కిరణ్ అధ్యక్షత వహించగా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ఎంపీడీవో శివాజీ, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ, ఎంవీఐ రాహుల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మురళి, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CCS Police | పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల మెరుపుదాడి.. ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానాలు..
