అక్షరటుడే, కామారెడ్డి: DGP Shivdhar Reddy | రాష్ట్రంలో హత్యలకంటే రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యనే ఎక్కువగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. మంగళవారం ఆయన కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కేవలం పోలీస్, రవాణ శాఖలకు (Transport Department) మాత్రమే సంబంధించినది కాదని, ఇది సమాజానికి సంబంధించిన అంశమన్నారు.
DGP Shivadhar Reddy | రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణం..

రాష్ట్రంలో ప్రతిఏటా దాదాపు 800 మంది హత్యల వల్ల చనిపోతుంటే, రోడ్డు ప్రమాదాలతో సగటున 7,500 మంది మృత్యువాత పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ఇంత పెద్ద సమస్య పరిష్కారంలో ప్రభుత్వ యంత్రంగాన్ని మొత్తం భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం స్థాయి నుంచి అందరూ భాగస్వాములుగా ఉన్నప్పుడే ఉద్యమంలా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ ప్రయణలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు 75 శాతం చనిపోతున్నారని తెలిపారు.
జనవరి నెలలో సంగారెడ్డి జిల్లాలో కుటుంబ పెద్ద ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆయనపై ఆధారపడిన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. మృతుని ఇద్దరి పిల్లలను చంపి భార్య ఆత్మహత్య చేసుకుందన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు సీఎంతో మాట్లాడి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నాలుగు నెలల క్రితం ప్రారంభించినట్లు వెల్లడించారు. గతేడాది 7,500 రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఉంటే అరైవ్ అలైవ్ ప్రారంభం తర్వాత గడిచిన మూడు నెలల్లో 330 మరణాలు తగ్గాయని, ఈ లెక్కన మరో 9 నెలల్లో ఈ ఏడాది 1200 మరణాలు తగ్గుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా ఇళ్లకు వెళ్లడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
DGP Shivadhar Reddy | కళాశాల విద్యార్థుల ప్రత్యేక స్కిట్..
గాంధారి, భిక్కనూరు మండలాల్లో జరిగిన యదార్థ ఘటనల ద్వారా సాందీపని కళాశాల(Saandepani College) విద్యార్థులు చేసిన స్కిట్స్ అందరినీ ఆకట్టుకుంది. ఓ పదోతరగతి విద్యార్థి పాస్ అయ్యాక తండ్రి కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్తో తల్లినే యాక్సిడెంట్ ద్వారా పొట్టనపెట్టుకున్న స్కిట్ అందరిని కంటతడి పెట్టించింది. బీబీపేట మండలానికి చెందిన కళావతి తన ఒక్కగానొక్క కొడుకు టెట్ రాసి పాసయ్యాడని తెలిపింది. పెళ్లయి కొడుకు పుట్టిన రెండు నెలలకు ఇంటివద్ద ఖాళీగా ఉండలేక ఓ బ్యాంకులో ఉద్యోగం చూసుకున్నాడని, రోజులాగే వెళ్తున్నానమ్మ అని చెప్పి ఇంటినుంచి బయలుదేరి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడని కన్నీరు పెట్టుకుంది. హెల్మెట్ లేకపోవడం వల్ల తన కొడుకు మృతి చెందాడని రోధించింది. ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించాలని, తనలాంటి పరిస్థితి ఏ తల్లికి రావద్దని కోరింది.

DGP Shivadhar Reddy | పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్..
‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం ద్వారా బ్రాండ్ అంబాసిడర్స్గా ఎంపికైన 150 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అవగాహన కార్యక్రమాల వీడియోలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరించారు. అలాగే ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాలో పోలీసు శాఖ చేపట్టిన చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్స్ స్పాట్స్ వివరాలు, ఏడాది కాలంలో సంభవించిన ప్రమాదాలు, మృతుల వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
DGP Shivadhar Reddy | శభాష్ రవి.. సమాజ సేవకుడికి డీజీపీ అభినందన

గత మూడేళ్లలో సదాశివనగర్ సర్కిల్ పరిధిలో జాతీయ రహదారిపై ఎక్కడ ప్రమాదం జరిగినా అందరికంటే ముందుండి సీపీఆర్ ద్వారా, సమయానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించడం ద్వారా సుమారు 50 మంది ప్రాణాలను కాపాడిన సదాశివనగర్ మాజీ ఉప సర్పంచ్ వంకాయల రవిని జిల్లా పోలీసులు డీజీపీకి పరిచయం చేశారు. ఆయన చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలను మెచ్చుకున్న డీజీపీ శభాష్ రవి అంటూ భుజం తట్టారు. రవిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం విధి నిర్వహణలో బయటకు వెళ్లి వార్తలు సేకరించి సమాజానికి తమవంతుగా అవగాహన కల్పిస్తున్నా జర్నలిస్టులకు డీజీపీ చేతుల మీదుగా హెల్మెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra), డీఎఫ్వో నిఖిత, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవో గిరి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Lok Sabha Seats Increase | ఇక లోక్సభలో 850 సీట్లు.. కేంద్రం కీలక నిర్ణయం
