అక్షరటుడే, వెబ్డెస్క్ : Food Adulteration | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో భారీ ఎత్తున కల్తీ ఆహార పదర్థాలు లభ్యం అయ్యాయి. తాజాగా నగర కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) కల్తీమాఫియాకు వార్నింగ్ ఇచ్చారు.
ప్రజల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. కల్తీ నివారణ కోసం బేగం బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై, విధుల్లో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆటంకాలను తెలుసుకున్నారు.
Food Adulteration | 117 కేసులు నమోదు
ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు హెచ్-ఫాస్ట్ (H- Fast) బృందాలు నగరవ్యాప్తంగా 117 కేసులు నమోదు చేసి, సుమారు 129.34 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడంపై సీపీ అభినందించారు. ఆహార కల్తీ సమాజానికి పట్టిన చీడ పురుగన్నారు. హైదరాబాద్ను కల్తీ రహితంగా మార్చే ప్రక్రియను ఒక పవిత్రమైన మహా యజ్ఞంలా భావించి, సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
Food Adulteration | ఉక్కుపాదం మోపాలి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని సీపీ ఆదేశించారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 108 మంది పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా సీపీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎవరూ కూడా అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని, క్రమశిక్షణ తప్పితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని సైతం హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : Ameenpur HYDRAA demolitions | అమీన్పూర్లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్
