అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Turmeric Board Nizamabad | ఎంపీ అర్వింద్ (MP Arvind) నిజామాబాద్కు పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారని.. మరి పసుపు రైతులు మద్దతు ధర కోసం రోడ్డుపై ధర్నాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Turmeric Board Nizamabad | ఆన్లైన్ కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. 2004 నుంచి 2014 వరకు తాను మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కొనసాగిన సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమయస్ఫూర్తితో పరిష్కరించడం జరిగిందన్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చి దేశంలో ఎక్కడైనా కొనుక్కునే అవకాశం కల్పించామన్నారు. ఆన్లైన్ వస్తే రైతులకు మద్దతు ధర వస్తుందా లేదంటే నష్టపోతారా అనే భయం ఉన్నప్పటికీ మొదటగా నిజామాబాద్లో ఆన్లైన్ పద్ధతి తీసుకువచ్చామన్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆన్లైన్లో పాయింట్ జీరో పద్ధతి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
Turmeric Board Nizamabad | దేశంలోనే పెద్ద మార్కెట్ నిజామాబాద్..
దేశంలో 10 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చే పెద్ద మార్కెట్ నిజామాబాద్ (Nizamabad Market) అని తెలిపారు. సాంగ్లీ, ఈరోడ్ మార్కెట్లతో పోటీ ఉంటుందని నగేష్ రెడ్డి చెప్పారు. ఆ మార్కెట్లలో ఉన్న ధరల కంటే ఎక్కువ ధర ఇక్కడ వచ్చే విధంగా పోటీ పడాల్సి ఉంటుందన్నారు. అయితే సాంగ్లీలో 3000 క్వింటాళ్ల కంటే ఎక్కువ పసుపు రాదని అదే నిజామాబాద్ (Nizamabad)కు సీజన్ బట్టి రోజుకు 50 వేల నుంచి 60 వేల క్వింటాళ్ల పసుపు వస్తుందన్నారు. ధర కోసం అప్పట్లోనే తాము మార్కెట్లో మూడు వేర్వేరు స్థానాలలో రైతుల ద్వారా పసుపును కుప్పలు పోయించడం జరిగిందని, దీని ద్వారా సాంగ్లీ కంటే ఎక్కువగా రూ.17వేల క్వింటాల్కు ధర కల్పించడం జరిగిందని గుర్తు చేశారు.
Turmeric Board Nizamabad | 2009లో తులం బంగారం రూ.18వేలు ఉంటే..
2009లో తులం బంగారం రూ.18 వేలు ఉంటే క్వింటాలు పసుపు ధర రూ.17వేల రూపాయలు వచ్చిందని ఆ విధంగా మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయడం జరిగిందని నగేశ్ రెడ్డి తెలిపారు. 2016లో పాయింట్ జీరోతో ఆన్లైన్ సాఫ్ట్వేర్ పద్ధతిని ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు నెలల క్రితం వరకు అదే సాఫ్ట్వేర్ కొనసాగిందని వివరించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 0.2 తీసుకురావడం జరిగిందని.. గతంలో ఉన్న కాంట్రాక్టర్తో ఒప్పందం అయిపోవడంతో వేరే వారికి అప్పగించడం ద్వారా సాఫ్ట్వేర్ను నిజామాబాద్ మార్కెట్కు అనుసంధానం చేయకుండా బీజేపీ కుట్ర చేసిందన్నారు. పసుపు బోర్డు నిజామాబాద్లో ఉన్నప్పటికీ ఎందుకు నిజామాబాద్ మార్కెట్కు సాఫ్ట్వేర్ అనుసంధానం చేయలేదని ప్రశ్నించారు.
Turmeric Board Nizamabad | వెంటనే సాఫ్ట్వేర్ను నిజామాబాద్ మార్కెట్కు కలపాలి..
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP Government) సాఫ్ట్వేర్ 0.2లో నిజామాబాద్ మార్కెట్ను కలపాలని డిమాండ్ చేశారు. కానీ అలా చేయకుండా రైతులను రోడ్ల మీదికి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరైంది కాదన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు. పంజాబ్ రైతులు నిరంతరం పోరాటం చేయడం ద్వారా వాటిని వెనక్కి తీసుకోవడం, అదేవిధంగా ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెట్టుకోవడం ద్వారా దేశ రైతులు నష్టపోతారన్నారు.
అమెరికాలో వేల ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తారని ఒక ఎకరాకు 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, అటువంటి దానిని జీరో టాక్స్ ద్వారా మన దేశానికి దిగుమతి చేస్తున్నారని.. ఇక్కడున్న మొక్కజొన్న ఎటు పోవాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు. దీని ద్వారా రైతులు నష్టపోతారని.. కావున వెంటనే వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే జైల్లో పెట్టారన్నారు.
Turmeric Board Nizamabad | పసుపు బోర్డుతో ఏలాభం..
ఎంపీ అర్వింద్ నిజామాబాద్కు పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని.. పసుపు బోర్డు ద్వారా రైతులకు నిజంగా లాభముంటే ఎందుకు పసుపు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారో చెప్పాలని నగేష్రెడ్డి ప్రశ్నించారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు వచ్చే లాభాలు ఏమీ లేవని పసుపునకు మద్దతు ధర కల్పిస్తే రైతుకు లాభాలు ఉంటాయన్నారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర ప్రకటించేలా అర్వింద్ కేంద్రంతో కొట్లాడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, కార్పొరేటర్లు ప్రవీణ్ గౌడ్, పంచారెడ్డి చరణ్, ఎర్రం గంగాధర్, అమర్ సింగ్, నరేందర్, హరిచంద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా ఫిషరీస్ ఛైర్మన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శివ, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, టౌన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుభాష్ జాదవ్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం : ఎమ్మెల్యే ధన్పాల్
