అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Investments | ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలలో జాతీయ అగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. అమెరికన్ పారిశ్రామికవేత్తలతో గురువారం ఆయన సమావేశం అయ్యారు.
డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు, ఏరోస్పేస్ విడిభాగాలు, రక్షణ ఎలక్ట్రానిక్స్, సైబర్ భద్రత (Cyber Security), అంతరిక్ష సాంకేతికత, రక్షణ రంగంలో ఏఐ, ఉపగ్రహ వ్యవస్థలు, అధునాతన కమ్యూనికేషన్ల వంటి రంగాలలో తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి చెప్పారు. రాకెట్ల తయారీ నుంచి అధునాతన డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి ఉపగ్రహాల వరకు “మేడ్ ఇన్ తెలంగాణ” ముద్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలలో 30 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోందని వెల్లడించారు.
Telangana Investments | దిగ్గజ సంస్థలు
డీఆర్డీవో (DRDO), బీహెచ్ఈఎల్, మిథాని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆర్సీఐ, హెచ్ఏఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, ఎయిర్బస్, డాసాల్ట్ ఏవియేషన్ వంటి ప్రపంచ ఏరోస్పేస్ దిగ్గజాలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ఏరోస్పేస్ నగరంగా నిలిచిందని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఒక పటిష్టమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని మంత్రి నొక్కి చెప్పారు. టీఎస్-ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజులలోపు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
Telangana Investments | సాంకేతిక రంగంలో..
సాంకేతికత, పరిశోధన, తయారీ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో కూడా అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా మారడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని శ్రీధర్బాబు పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కౌన్సిలర్ పాల్ నారాయణ్ అన్నారు.
ఇది కూడా చదవండి : MeeSeva ACB raids | మీసేవా కేంద్రాలపై ఏసీబీ దాడులు.. పలు కీలకపత్రాలు స్వాధీనం..
