అక్షరటుడే, వెబ్డెస్క్ : Sigachi accident compensation | సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక సీఎం రేవంత్రెడ్డి తన అసమర్థతను చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో గతేడాది జరిగిన ప్రమాదంలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ప్రమాదం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటిపరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే అందులో సగం కూడా ఇవ్వలేదని హరీశ్రావు విమర్శించారు. సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అయ్యాయన్నారు.
Sigachi accident compensation | రూ.45.40 లక్షలే..
యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని హరీశ్రావు (Harish Rao) మండిపడ్డారు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన 24.51 కోట్లను విభజించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం 45.40 లక్షలు మాత్రమే అననారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు 54.60 లక్షల చొప్పున, మొత్తంగా 29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని విమర్శించారు.
Sigachi accident compensation | యాజమాన్యం మోసం
యాజమాన్యం తాము రూ.40 నుంచి రూ.42 లక్షలు ఇస్తున్నామని కోర్టుల ముందు ఒప్పుకుందన్నారు. అయితే ఆ సంస్థ సొంతంగా ఇచ్చిందిరూ.25 లక్షలు మాత్రమేనని చెప్పారు. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని ఈ లెక్కలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బును కూడా కంపెనీ జేబులో నుంచి ఇస్తున్నట్లు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని హరీశ్రావు అన్నారు. అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పీఎఫ్, ఈఎస్ఐ (ESI) డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి : Microfinance Fraud Arrest | మైక్రో ఫైనాన్స్ కేసులో రమావత్ మధు అరెస్ట్
