అక్షరటుడే, వెబ్డెస్క్: US Iran talks | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా (America) మరియు ఇరాన్ మధ్య మరోసారి చర్చల ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. ఇటీవల ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా జరిగిన తొలి విడత చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రెండో విడత చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు ముందుకు వస్తున్నాయని సమాచారం.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, గురువారం ఈ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని, చర్చల తేదీ, వేదికపై తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సున్నితమైన అంశం కావడంతో వివరాలు వెల్లడించకుండా అమెరికా అధికారులు, ఒక దౌత్యవేత్త ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
US Iran talks | జెనీవా వేదికగా..
ఈ చర్చలు జరుగుతున్న సమయంలో, గత వారం ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలు మళ్లీ ప్రారంభమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండో విడత చర్చలు కూడా ఇస్లామాబాద్లోనే జరిగే అవకాశమున్నప్పటికీ, ప్రత్యామ్నాయంగా జెనీవా వేదికగా కూడా నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి చర్చల్లో పాల్గొనే ప్రతినిధి బృందాల స్థాయి, వారి అజెండా వంటి అంశాలు ఇంకా స్పష్టతకు రాలేదు. తొలి విడతలో ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనగా, రెండో దశలో కూడా అదే స్థాయి పాల్గొనుతారా అనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
US Iran talks |ఈ పరిస్థితుల్లో
ఇదిలా ఉండగా, డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చలకు మరింత ప్రాధాన్యతను తెచ్చాయి. “మరో పక్షం నుంచి మాకు కాల్ వచ్చింది. వారు ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు” అని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య చర్చలు ముందుకు సాగుతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి. గతంలో ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి అమెరికా, ఇరాన్పై దాడులు చేపట్టగా, అనంతరం ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు జరగడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని నివారించేందుకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఇస్లామాబాద్లో జరిగిన తొలి విడత చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో ఒప్పందం దిశగా ముందడుగు పడలేదు. చర్చల వైఫల్యానికి ఇరుదేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత చర్చల ప్రయత్నాలు విజయవంతమైతే, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశముంది. లేనిపక్షంలో పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: US Iran Nuclear Talks | బాల్ ఇప్పుడు వారి కోర్టులోనే ఉంది..: జేడీ వాన్స్
