అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/భీమ్గల్: TGEJAC Protest | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి హాజరయ్యారు.
TGEJAC Protest | ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు..
ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ లోపల పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ అనంతరం పదేళ్లుగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు అధ్యక్షతన, 206 పైగా భాగస్వామ్య సంఘాలతో టీజీఈజేఏసీ స్థాపించి, పలుమార్లు 69 పైగా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టాయన్నారు. పీఆర్సీ కమిటీ వేసి 30 నెలల గడుస్తున్నా నేటికీ నివేదిక తెప్పించుకోకపోవడం విడ్డూరమన్నారు.
అతి త్వరగా 51శాతం శాతం ఫిట్మెంట్తో 2వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.13 వేల కోట్లకు పైగా బకాయి పడ్డ పెండింగ్ బిల్లులన్నింటిని ఏకమొత్తంగా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ, ఆరోగ్య కార్డులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సీపీఎస్ స్కీం రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, వీటితోపాటు మిగతా 64 డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు.
TGEJAC Protest | డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..: నాశెట్టి సుమన్ కుమార్
టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన నాలుగు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యచరణను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనికి గాను ఉద్యోగులందరూ సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా కో–కన్వీనర్ మోహన్ రెడ్డి, కో –ఛైర్మన్లు రమేష్, రమణ్ రెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేష్, పండరీ నాథ్, వైస్ ఛైర్మన్లు విజయ్ సింగ్, శేఖర్, అమృత్ కుమార్, ప్రశాంత్, మోహన్, ఫైనాన్స్ సెక్రెటరీ జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ
