అక్షరటుడే, కామారెడ్డి: Mudiraj Population Issue | తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ల సంఖ్యను 20 లక్షల వరకు తగ్గించి చూపడం సరికాదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి (Mudiraj Rights Realization Committee) రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో శనివారం మీడియాతో మాట్లాడారు.
Mudiraj Population Issue | అధ్వానంగా రాష్ట్ర జనాభా లెక్కలు..
రాష్ట్రంలో జనాభా లెక్కలు అధ్వానంగా చేపట్టారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సకల జనుల సమ్మెలో 2014-15 లో ముదిరాజ్లు 46 లక్షలు ఉండేవారని తెలిపారు. గత 12 ఏళ్లలో ఉన్న జనాభాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం 26 లక్షలకు తగ్గించిందన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ముదిరాజ్ సమాజం అంతరించి పోతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అధ్వానంగా జాతులను ఎక్కువ, తక్కువగా చూపుతూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. ముదిరాజ్లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు.
Mudiraj Population Issue | మత్స్యశాఖలో ముదిరాజ్లకు సమానహక్కులివ్వాలి..
98 జీవో ప్రకారం మత్స్య శాఖలో (Department of Fisheries) ముదిరాజ్లకు సమానమైన హక్కు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. ముదిరాజ్ల మీద సీఎంకు ఎలాంటి ప్రేమ ఉందో ఈ లెక్కలతో స్పష్టం అవుతోందన్నారు.
వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటేనని, ఇప్పటివరకు ముదిరాజ్ల అంశాన్ని సీఎం దగ్గర చర్చించలేదన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ను చేసినా ఒక్క రూపాయి కేటాయించలేదని, అలాంటప్పుడు కార్పొరేషన్ దేనికి.. ఛైర్మన్ పదవి ఎందుకు..? అని ప్రశ్నించారు.
పేరుకే కార్పొ రేషన్, ఛైర్మన్ ఉన్నారని, పేరుకే ఎమ్మెల్యే.. మంత్రి ఉన్నారని మండిపడ్డారు. ముదిరాజుల జనాభా లెక్కలను 20 లక్షలకు కుదించి ముదిరాజ్లను తొక్కేశారన్నారు. ఎన్నికల్లో బీసీ డి నుంచి ఏ లోకి మారుస్తామని హామీ ఇచ్చారన్న విషయం గుర్తుందా అని ప్రశ్నించారు.
ఇకనైనా మంత్రి, ఛైర్మన్లకు కనువిప్పు కలగాలని, ఈటల రాజేందర్, బండ ప్రకాష్ లాంటి వాళ్ళు ముందుకు రావాలన్నారు. ముదిరాజ్ హక్కుల సాధన సమితి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Mudiraj Population Issue | కామారెడ్డి డిక్టరేషన్ అమలు చేయకుంటే..
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామన్నారు. తమకు రిజర్వేషన్ ఇవ్వాలని, మత్స్య శాఖలో సముచిత స్థానం కల్పించాలని, కార్పొరేషన్కు రూ.5 వేల కోట్లు కేటాయించి ఉపాధి మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల సుధాకర్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పడిగే ప్రశాంత్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జి ఉప్పాల బాలేష్, కామారెడ్డి జిల్లా మీడియా ఇన్ఛార్జి రాజు ముదిరాజ్, డివిజన్ మీడియా ఇన్ఛార్జి చెట్టబోయిన స్వామి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి శిలాపురం రాజు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
